
వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం
గుంతకల్లుటౌన్: తమ హక్కులను కాలరాస్తున్న వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతామంటూ ముస్లింలు నినదించారు. శనివారం గుంతకల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈద్గా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, మెయిన్ రోడ్డు మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్త కాదన్నారు. అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాడతామన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ముస్లిం మైనార్టీలతో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు నడుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లింల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. మైనార్టీ వర్గాలను అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అధికారమెప్పుడూ శాశ్వతం కాదని కూటమి నేతలు గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు కలిసిరావాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికే మోదీ కుట్ర చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డి.జగదీష్ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు వి.రాంభూపాల్ మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మైమూన్, నైరుతిరెడ్డి,ఖాజీ సయ్యద్ రజాక్పీర్సాబ్, అదనపు ఖాజీ సత్తార్సాబ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్, ముస్లిం జేఏసీ కన్వీనర్ సద్దామ్, మైనార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ముస్లింల హక్కులను హరించే అధికారం మీకెవరిచ్చారు?
గుంతకల్లులో కదం తొక్కిన ముస్లింలు

వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం