మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం : పురపాలిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగిద్దాం అని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ నాయకులతో పార్టీ కార్యాలయంలో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్తో పాటు మున్సిపాలిటీలోని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు అబద్దాలను అస్త్రంగా వాడుకుంటున్నారన్నారు. ప్రజల్లో కూటమిపై వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పింఛన్లు పంపిణీని తెరమీదకు తెచ్చారన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇచ్చిన పింఛన్లు చంద్రబాబు తీసేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చాయనే మళ్లీ పింఛన్ల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ సంక్షేమ ప్రదాత జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రతి వార్డులో అభ్యర్థులను బరిలో దింపడమే కాకుండా గెలుపు ధ్యేయంగా పని చేద్దామని కోరారు. ఎన్నికల సమయంలో బెదిరింపులకు గురిచేసిన ప్రతి అధికారి వివరాలు మన డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. పురపాలికలో మెజారిటీ స్థానాలు గెలిచి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ తదితరులు పాల్గొన్నారు.


