● రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిపాయ ధరలు
● అయోమయంలో వినియోగదారులు
అనకాపల్లి టౌన్: ఉల్లిపాయ కోయకుండానే కంటతడి తెప్పిస్తుంది. ఇది లేనిదే ఏ కూరలు వండడం దాదాపు సాధ్యం కాదు. సాంబార్, పప్పు, వేపుళ్లు, గ్రేవీ కూరీలు, చట్నీలు ఇలా ప్రతీ వంటకంలో ఉల్లి ఉండాల్సిందే. వంటకాలలో ఉల్లిదే అగ్రస్థానం. అటువంటి ఉల్లిపాయ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తున్నారు. గత వారం క్రితం కిలో రూ.34 ఉన్న ఉల్లిపాయ ధర నేడు రూ.50లకు పలుకుతుంది. నిన్నటి వరకు కిలోల లెక్కన కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రస్తుతం ధరలు చూసి అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఈ ధరలు అల్పాదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కాయగూరల ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులు ఒక్కసారిగా పెరిగిపోతున్న ఉల్లిపాయ ధరతో మరింత సతమతమవుతున్నా పలువురు చెబుతున్నారు.
సాగుపై ఎల్నినో ప్రభావం
మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి మార్కెట్కు ఉల్లి రాక తగ్గిపోయింది. అలాగే ఎనినో ప్రభావంతో ఉల్లి సాగు ఆలస్యమవడం, కోల్డ్ స్టోరేజ్లలో ఉన్న నిల్వలు మాత్రమే మార్కెట్కు తెస్తుండడంతో ఉల్లి ధర భారిగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు
ఉల్లిపాయ ధరల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమండ్ చేస్తున్నారు. మార్కెట్ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. తక్షణమే రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటు ధరల్లో ఉల్లిపాయలు, కాయగూరల విక్రయాలు చేపట్టాలని కోరుతున్నారు.


