ఎక్కడి సమస్యలు అక్కడే
మొక్కుబడిగా జీవీఎంసీ ప్రధాన కమిషనర్ పర్యటన
తూతూ మంత్రంగా పీజీఆర్ఎస్
ఆదాయ మార్గాలపై సమీక్ష నిల్
పెండింగ్ సమస్యలపైపట్టించుకోని అధికారులు
ప్రజలకు తప్పని నిరాశ
అనకాపల్లి టౌన్: పట్టణంలో మూడు రోజుల క్రితం జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గార్గ్ పర్యటన తూ.తూ మంత్రంగా సాగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన సమస్యలపై ఇక్కడి అఽధికారులతో సమీక్ష నిర్వహించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవల్సిన ఉన్నతాధికారి కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం అయ్యారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తే బాగుండేదని, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డంపింగ్ యార్డు, మూతపడి ఉన్న కమర్షియల్ షాపులు, కళ్యాణ మండపాలపై దృష్టి సారించాలని పలు ప్రజా సంఘాల నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
డంపింగ్యార్డ్పై స్పందన లేదు...
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనేందుకు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కూడా ముందస్తు ప్రచారం లేకపోవడంతో మొక్కుబడిగా నిర్వహించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదులను స్వీకరించడం, పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ కనిపించలేదు. ముఖ్యంగా రాజీవ్గాంధీ ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు ఆలస్యం అవడంతో అంచనా వ్యయం కూడా అధికమవుతుంది. వీటిని పరిశీలించిన కమిషనర్ ఎన్ని రోజుల్లో పనులు పూర్తి చేస్తారో స్పష్టంగా తెలపలేదు. జీవీఎంసీ కార్యాలయంలోనే ఉన్న డంపిగ్ యార్డు మూడు నెలల్లోగా తరలిస్తామని, ముక్తసరిగా సమాధానం ఇచ్చారే తప్ప ఎక్కడకు తరలిస్తామనేది స్పష్టత ఇవ్వలేదు.
ఆదాయ మార్గాలపై సమీక్ష నిల్..
పట్టణం సుందరంగా తీర్చిదిద్దాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, జీవీఎంసీకి ఆదాయం సమకూరే మార్గాలపై నిరంతరం దృష్టి కేంద్రీకరించాలి. పట్టణంలో ప్రకటనల ఆదాయం, ఆక్రమణలు, ఖాళీ షాపులు అద్దెలకు ఇవ్వడం వంటి ఆంశాలపై సమగ్ర సమీక్ష అవసరం ఉన్నపన్పటికీ ఆ దిశగా కమిషనర్ దృష్టి సారించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టణంలో సందర్శించడం కేవలం కార్యక్రమాల నిర్వహణకు పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని, వాటిని పరిష్కరింయాలని ప్రజలు కోరుతున్నారు.


