పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిశ్రమల్లో తగురీతిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్రెడ్డిలు డిమాండ్ చేశారు. వారు ఫార్మాసిటీలోని అరాజెన్ పరిశ్రమను మంగళవారం సందర్శించి యాజమాన్యంతో చర్చలు జరిపారు. నిర్వాసితుల ఉపాధిపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో సర్వస్వం కోల్పోయిన లంకెలపాలెం దరి లేమర్తి భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాది అవకాశాలు దక్కలేదని ఆరోపించారు. 2005లో ఫార్మాసిటీ పరిశ్రమల ఏర్పాటు సమయంలో నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఇచ్చిన హామీ అమలు కాకపోవడం విచారకరమన్నారు. అనేక పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ నిర్వాసితులకు సరైన రీతిలో న్యాయం చేసేలా యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాతపాటి ఆర్ఎస్వీ ప్రసాద్రాజు, అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, పరవాడ మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు, మండల వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నక్కా రమణబాబు, పూర్ణానందశర్మ, బోరా సోమునాయుడు, ఇళ్లపు వాసు, జీలకర్ర నాగేంద్ర, గొందేసి శ్రీనివాస్ రెడ్డి, గొడబా మనోజ్, పైడిరాజు, ఎర్ని రమణ, బిమ్మిటి శ్రీనివాస్, చొప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


