మునగపాక : మునగపాకలో జరిగిన హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు యలమంచిలి సీఐ ఎస్.ధనుంజయరావు తెలిపారు. కేసు వివరాలను ఆయన స్థానిక ఎస్ఐ ప్రసాదరావుతో కలిసి విలేకరులకు తెలిపారు. రెండు కుటుంబాల మధ్య గతంలో జరిగిన మాటల వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేయడంతో మృత్యువాతకు గురయ్యాడన్నారు. మునగపాకలోని పల్లపు వీధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన దాడి భాస్కరరావు అతని సోదరుడు జగదీష్లతో దేవకికి రెండు రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. వారి మధ్య మాటల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. సోమవారం రాత్రి దేవకి నాగప్పారావు తన మేడపై నిద్రిస్తున్న సమయంలో భాస్కరరావు, జగదీష్లు కలిసి దాడి చేశారు. ఈ సంఘటనలో దేవకీ నాగప్పారావు తీవ్రంగా గాయపడడంతో అతనిని అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.
మునగపాకలో విషాద ఛాయలు
ఎంతో ప్రశాంతంగా ఉండే మునగపాక నాగప్పారావు హత్యతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అందరితో సరదాగా మెలిగే దేవకీ నాగప్పారావు మృత్యువాతకు గురయ్యారన్న సమాచారంతో మునగపాకలో విషాదం నెలకొంది. మృతదేహానికి అనకాపల్లి వందపడకల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియలకు మునగపాక గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళవారం ఉదయం యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎస్ఐ ప్రసాదరావుతో పాటు క్లూస్ టీమ్ పరిశీలించి పలు వివరాలు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రిమాండ్కు తరలింపు


