● మునగపాకలో భారీ చోరీ
● 10 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదు అపహరణ
మునగపాక : మండల కేంద్రంలో పట్టపగలు చోరీ సంఘటన చోటు చేసుకుంది. నిత్యం జన సంచారం ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మునగపాకలోని సాంబశివుని ఆలయ సమీపంలో అనకాపల్లి భీమ, లక్ష్మి దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. భీమ పరవాడ ఫార్మాసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మి అచ్యుతాపురంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దంపతులిద్దరూ మంగళవారం ఉదయం ఏ షిప్టుకు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు తీసి ఉండడాన్ని గుర్తించి లోపలికి వెళ్లే సరికి బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు నిర్ధారించుకున్నారు. బీరువాలోని 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు చోరీకి గురైందని తెలుసుకొని మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకొని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


