రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతికి అంతర్జాతీయ విద్యా పరిశోధనకు అరుదైన అవకాశం లభించింది. ఆమెకు అందిన సమాచారం మేరకు ఈ నెల 15 న ఫిన్ల్యాండ్లో గల తుర్కు యూనివర్సిటీలో విద్యావిధానాలను అధ్యయనం చేయడానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ తనకు లభించిన ఆరుదైన అవకాశం గురించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకూ తుర్కు యానివర్సిటీలో విద్యా అధ్యయనం ఉంటుందన్నారు. అక్కడ విద్యా విధానాలు, బోధనా ప్రక్రియలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల అభ్యసన వాతావరణం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తానన్నారు. అక్కడ అధ్యయనం చేసిన అంశాలపై పట్టు సాధించి ఆచరణలోకి తీసుకురావడమే తన లక్ష్యం అన్నారు.


