సాక్షి, విశాఖపట్నం: వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సీఎండీ’కి మంచి స్పందన లభిస్తోందని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఆరు నెలల్లో 1,087 ఫిర్యాదులు అందగా, 1,046 పరిష్కరించినట్లు వెల్లడించారు. మిగిలిన ఫిర్యాదులను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. వీటిలో వోల్టేజ్, విద్యుత్ సరఫరాకు సంబంధించి 561, కొత్త కనెక్షన్లు 173, స్తంభాలు–లైన్లు–డీటీఆర్లకు 124 ఫిర్యాదు లు ఉన్నాయి. సమస్యలను కేవలం నమోదు చేయడానికే పరిమితం కాకుండా, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా సంస్థ అడుగులు వేస్తోందని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఏకంగా రూ.7.47 కోట్ల అంచనాలతో 305 అభివృద్ధి పనులను సంస్థ మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా 164 సింగిల్ ఫేజ్, 47 త్రీ ఫేజ్ డీటీఆర్లు, 508 విద్యుత్తు స్తంభాలు, 55.27 కిలోమీటర్ల మేర లైన్ల నిర్మాణం, 2,590 మీటర్ల కేబుల్ ఏర్పాటు పనులు చేపట్టినట్లు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వివరించారు.


