అనకాపల్లి: వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఆర్థికసాయం అందజేస్తే అందజేస్తే, కూటమి ప్రభుత్వం కుంటిసాకులతో చేనేత కార్మికులను మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు ఆకుల సంతోష్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో చేనేత కార్మికునికి రూ.24వేలు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా అందించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అనేక కుంటిసాకులు చెప్పి పథకం ఎగ్గొట్టిందని, తీరా ఈ సంవత్సరమైనా పూర్తిగా అందిస్తారు అనుకుంటే, కూటమి నాయకులు కొన్ని చోట్ల మగ్గం నేసే కార్మికుల నుంచి రూ.3 వేలు, మగ్గం నెయ్యని కార్మికుని నుంచి రూ.10వేలు వసూలు చేస్తూ పేద చేనేత కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులు అందరికీ ఒకేవిధంగా నగదు చెల్లించాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల పక్షాన పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చేనేత విభాగం పట్టణ అధ్యక్షుడు కొమ్మన శంకర్, జిల్లా సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి తంగెల్ల రామకృష్ణ్ణ, పట్టణ ట్రేడ్ యూనియన్ సభ్యులు దేశెట్టి బసవేశ్వర రావు, నాయకులు ఈమంది శ్యామలరావు, బేతా ఈశ్వరరావు పాల్గొన్నారు.


