వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడమే కారణం
12 మంది పింఛన్లు నిలిపేిసిన కూటమి నేతలు
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాధితుల నిరసన
నాతవరం: ఏళ్ల తరబడి తీసుకుంటున్న పేదల పింఛన్లు రాకుండా కూటమి నేతలు నిలుపుదల చేసారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయుకులు అంకంరెడ్డి రాజు, పైల మణేంద్ర, గాడి పోతురాజు ఆరోపించారు. పింఛన్లు నిలిపేసిన లబ్ధిదారులు గురువారం అధికారులకు ఫిర్యాదు చేసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కూటమి నేతలు చేసిన కక్ష పూరిత రాజకీయంపై స్ధానిక వైఎస్సార్సీపీ నేతలు లబ్ధిదారులతో కలిసి నాతవరంలో రిలే నిరహార దీక్ష శిబిరానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మండలంలో చినగొలుగొండపేట గ్రామానికి చెందిన కాళ్ల రాంబాబు, కరక సత్యనారాయణ, గాడి సత్యనారాయణ, కుందేటి కొండబాబు, కుందేటి అర్జునరావు, పైల నూకరాజు, అంకంరెడ్డి వెంకటరమణ, చిందం దేవుళ్లు, అంకంరెడ్డి నూకరాజు, బొడ్డు రాంబాబు, కుందేటి అప్పలస్వామి, బందం రాంబాబు సుమారుగా ఎనిమిదేళ్లుగా గ్రామంలో ప్రభుత్వం అందిస్తునసంక్షేమ పింఛన్లు పొందుతున్నారు. వీరంతా వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో గ్రామానికి చెందిన కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేసి ఈ నెల నుంచి పింఛన్లు రాకుండా అడ్డుకున్నారన్నారు. వీరంతా పేదలు కావడంతో గ్రామంలో ఎనిమిదేళ్లుగా వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి పింఛన్లు పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కానీ వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్నారన్న అక్కసుతో పింఛన్లు నిలిపివేయించారని ఆరోపించారు. ఉన్నత స్ధాయి అధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


