నేడు ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం ఇంకా సిద్ధం కాని విద్యార్థి మిత్ర కిట్లు మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాలు మాత్రమే అరకొరగా చేరిన వైనం యూనిఫామ్, బ్యాగ్, బెల్ట్, సాక్స్, నోట్ పుస్తకాల ఊసే లేదు గతంలో పాఠశాల తెరచిన రోజే పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అందని కిట్లు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు తప్పని తిప్పలు జిల్లాలో 1,436 పాఠశాలలు..1.46 లక్షల మంది విద్యార్థులు
● సమస్యలు తోడుగా
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నప్పటికీ, విద్యార్థులకు అత్యంత కీలకమైన ‘విద్యార్థి మిత్ర’ కిట్లు ఇంకా సిద్ధం కాలేదు. వాస్తవానికి బడి తెరిచే నాటికే ఈ కిట్లను విద్యార్థుల చేతుల్లో పెట్టాల్సి ఉంది. అవి అందిన తర్వాతే పాఠశాలల్లో తరగతులు సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది. కానీ, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు ఎక్కడా కిట్ల జాడ కనపడడం లేదని పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. తొలిరోజే కిట్లు అందించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపాల్సిన ప్రభుత్వం కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా బడులు ప్రారంభించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
చరిత్ర తిరగ రాసిన జగన్ ప్రభుత్వం..
గతంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే అందించి ప్రభుత్వాలు చేతులు దులుపుకొనేవి. ఆ పుస్తకాలను సైతం విద్యా సంవత్సరం ముగిసే సమయానికి ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా అత్యంత నాణ్యతతో కూడిన నోటు పుస్తకాలు, బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్ట్, సాక్స్, వర్క్ బుక్లు.. ఇలా అన్ని వస్తువులను ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో ఒకే కిట్గా అందించడం ప్రారంభించింది. విద్యాకానుకను పాఠశాల తెరిచిన తొలి రోజునే ఆయా విద్యార్థులకు అందించడాన్ని ఒక సంప్రదాయంగా మార్చింది. దానికి అనుగుణంగానే ముందస్తు ప్రణాళికలు వేసి పక్కాగా అమలు చేసేవారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ కిట్ జాడ మాత్రం ఎక్కడా కానరావడం లేదు.
అరకొరగానే పాఠ్యపుస్తకాలు
జిల్లా వ్యాప్తంగా గడిచిన నెల రోజులుగా మొదటి సెమిస్టర్కు అవసరమైన పాఠ్యపుస్తకాలు మాత్రమే మండల కేంద్రాలకు చేరుకున్నాయి. అవి కూడా అరకొరగానే వచ్చినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇంకా చాలా పాఠశాలలకు మండల కేంద్రాల నుంచి పుస్తకాలు అందాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది సరఫరా చేసిన బ్యాగ్లు సైతం నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. పుస్తకాలు సైతం అర కొరగా మాత్రమే ఇచ్చారంటూ విద్యార్థులు వాపోయారు. అయితే ఈ ఏడాది కనీసం ఆ ఊసే ఎత్తడం లేదంటూ ఉపాధ్యాయ వర్గాలే విమర్శిస్తున్నాయి.
జిల్లాలో వివరాలు ఇలా..
జిల్లాలో 1436 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 1037 ప్రైమరీ, 57 అప్పర్ ప్రైమరీ, 342 హైస్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1,46,000 మంది విద్యార్థులు(గతేడాది గణాంకాల ప్రకారం) ఉన్నారు.


