మాడుగుల: స్థానిక పాల కేంద్రంలో గురువారం హౌసింగ్కు సంబంధించి పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్.నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా అర్హుల వివరాలు రెవెన్యూ ద్వారా ఉన్నతాధికారులకు పంపించి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 355 మంది దరఖాస్తు చేసుకున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. దీంతో మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ మాట్లాడుతూ మాడుగులలో ఎటువంటి ఇళ్ల స్థలాలు గుర్తించకుండా అర్హుల జాబితా ఎలా వెల్లడిస్తారని, లబ్ధిదారులకు ఆశలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. దీంతో వారిరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. గత వైఎస్సార్సీపీ హయాంలో ముందుగా స్థలాలు గుర్తించి 323 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిందని, మాడుగుల పట్టణంలో జగనన్న కాలనీ నిర్మాణం చేపట్టడం జరిగిందని, అలాగే ముందు ఇంటి స్థలాలు చూపించి అపుడు అర్హుల జాబితా చదవాలని మాజీ ఎంపీపీ రామధర్మజ పట్టుబట్టారు. ఈ క్రమంలో కూటమి నాయకులకు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో అధికారులు గ్రామ సభ ముగించారు.
రసాభాసగా గ్రామసభ


