గోపాలపట్నం : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బాణసంచా ప్రమాదం సృష్టించిన శోకం ఇంకా పచ్చిగానే ఉంది. అక్కడ పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదం నుంచి ప్రజలు తేరుకోకముందే, విశాఖ నడిబొడ్డున ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుళ్లు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. నిబంధనలను తుంగలో తొక్కి నివాస ప్రాంతాల మధ్యే సాగుతున్న ప్రమాదకర కార్యకలాపాలు సామాన్యుడి ప్రాణాలకు గాలం వేస్తున్నాయి.
ఆ అరగంట.. అల్లకల్లోలం
ఆదివారం సాయంత్రం సరిగ్గా 5.30 గంటల నుంచి ఆరు గంటల మధ్య గోపాలపట్నం పరిధిలోని చంద్రనగర్, ఆదర్శనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం చిట్లిపోయిందా అన్నట్లుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. వరుసగా వినిపించిన పేలుళ్ల ధాటికి భూమి కంపించినట్టు అనిపించడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోవడం, గోడలకు పగుళ్లు రావడంతో ఆ తీవ్రత ఎంతటిదో అర్థమవుతోంది. ప్రాణనష్టం తప్పినా, అధికారుల కళ్లు గప్పి నివాస ప్రాంతాల్లో సాగుతున్న ప్రమాదకర కార్యకలాపాలు సామాన్యుడి ప్రాణాలకు గాలం వేస్తున్నాయి.


