● గ్రంథాలయానికి పుస్తకాల వితరణ
చింతపల్లి: మండలంలోని చౌడుపల్లి పంచాయతీ కేంద్రంలో ఇటీవల యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పుస్తకాలను వితరణ చేశారు. ఈ ప్రాంతం నుంచి డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే గిరిజన అభ్యర్థులకు ఉపయోగపడేలా, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను గ్రామానికి చెందిన బ్యాంక్ మేనేజర్ యెమ్మిలి శ్రీనివాస్ దంపతులు ఆదివారం ఉచితంగా అందజేశారు. గ్రామ పెద్దలు దేపూరి వెంగళయ్య, యెమ్మిలి మధు, గంపరాయి విజయ్కుమార్ సమక్షంలో గ్రంథాలయ నిర్వాహకుడు ఉగ్రంగి రవిప్రసాద్కు ఈ పుస్తకాలను అందించారు. అదేవిధంగా, వర్షపు నీరు లీక్ కాకుండా గ్రంథాలయ భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు జిల్లా ఉద్యానశాఖ అధికారి కంఠా బాలకృష్ణ ఆర్థిక సహాయం అందించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


