కాంట్రాక్ట్ ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తున్న జేఏసీ నాయకులు
మహారాణిపేట(విశాఖ): కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఆదివారం సమరభేరి మోగించింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల జోన్–1 మహా సమావేశాన్ని టర్నర్ సత్రం ఆవరణలో నిర్వహించాలని నిర్ణయించగా, అనుమతులు రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించవద్దని సూచించారు. దీంతో సమావేశాన్ని రామాటాకీస్ అంబేద్కర్ భవన్కు మార్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జేఏసీ నాయకులు ఎస్.కె.ఆశ, ఎం.సిహెచ్ కిశోర్రావు, పైడిరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు చేరుకున్న వెంటనే పోలీసులు అంబేడ్కర్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. తనిఖీల అనంతరం మాత్రమే లోపలికి అనుమతించారు.
డిమాండ్లపై ఉద్యోగుల ఆందోళన
పోలీసు ఆంక్షల మధ్య సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది.
అనుమతి లేకుండా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించవద్దని పోలీసులు సూచించారు. ఇటీవల సచివాలయం ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా నిబంధనలు విధించినట్లు తెలిసింది. మధ్యాహ్నానికి సమావేశం ముగిసింది. శాంతియుతంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యక్రమం చేపడుతుండగా పోలీసుల ఆంక్షలు విధించడం సరికాదని జేఏసీ నాయకులు ఎస్.కె.ఆశ, ఎం.సిహెచ్ కిశోర్రావు, పైడిరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశానికి పోలీసుల ఆంక్షలు


