● ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడువంతల కృష్ణ
పాడేరు రూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలబాలికల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక సందర్శన కార్యక్రమం చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతల కృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. గిరిజన వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి వసతులు సరిగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో కూడా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మెనూ సరిగా అమలు కావడం లేదని, నాణ్యత కరువైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తామే ప్రత్యక్షంగా వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాల నాయకులంతా కలిసికట్టుగా పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్, సాయి, ఇసాక్, సత్య, మోహన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


