● పాలసముద్రంలా వ్యూ పాయింట్
● తరలివస్తున్న పర్యాటకులు
చింతపల్లి: ఆంధ్ర కాశ్మీర్గా గుర్తింపు పొందిన లంబసింగికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఏడాది అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో మన్యంలో వాతావరణం భిన్నంగా, ఆహ్లాదకరంగా మారింది. దాంతో వారాంతాల్లో (వీకెండ్స్లో) పర్యాటకులు ఏజెన్సీకి తరలిరావడం ప్రారంభమైంది. ప్రస్తుతం లంబసింగి ప్రాంతంలో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో అప్పుడే పర్యాటక సీజన్ ప్రారంభమైందా అనే భావన కలుగుతోంది. లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద పాలసముద్రాన్ని తలపించే మేఘాల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.


