చింతపల్లి: ప్రభుత్వ ద్వారా పంపిణీ అవుతున్న సిల్వర్ ఓక్ మొక్కలను పక్క గ్రామాల వారికి సొమ్ముకు అమ్ముకోకుండా, తమ గ్రామస్తులకే అందేలా చర్యలు తీసుకోవాలని బెన్నవరం పంచాయతీ కట్టువీధి గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శనివారం వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్టువీధి గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ.. తమ గ్రామానికి 21 మందికి సిల్వర్ ఓక్ మొక్కలు మంజూరు కాగా, కేవలం ఇద్దరికి మాత్రమే ఇచ్చి మిగతా వాటిని పక్క గ్రామాలైన కొత్తవలస, పోతురాజుగున్నల రైతులకు ఒక్కో మొక్కకు రూ. 500 చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మా గ్రామానికి రావలసిన మొక్కలను పక్క గ్రామస్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తూ, ‘ఏం చేసుకుంటారో చేసుకోండి‘ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, గత నెల రోజులుగా గ్రామంలో ఉపాధి హామీ పని చేసినా, సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ కావాలనే తాత్సారం చేస్తూ వేతనాలు జనరేట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు ఉపాధి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేడు మండల అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి రావాల్సిన సిల్వర్ ఓక్ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు, నిలిచిపోయిన వేతనాలను ఇప్పించాలని వెలగ కృష్ణ, గెమ్మిలి జోసఫ్, మామిడి లక్ష్మణ్, సూకూరు యూసఫ్, సూకూరు చిన్నబ్బాయి, కొర్రా బాలకృష్ణ తదితరులు డిమాండ్ చేశారు.


