విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా స్పందిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బి.వి.ఆర్.మూర్తి, డి.మంజులత, ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, కె.రామజోగేశ్వరరావులు నేలపాడులోని హైకోర్టు ఆవరణలో జస్టిస్ దేవానంద్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ న్యాయవాదుల పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన విధంగా స్పందిస్తామని జస్టిస్ దేవానంద్ హామీ ఇచ్చారు. విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఎందరో మహనీయులతో ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖ బార్ అసోసియేషన్ సమస్యలపై అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


