కారులోనే ఒకరు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇంకొకరు మృతి
చింతూరు: ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో కారు దహనమై ఇద్దరు మృతి చెందిన ఘటన పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో జాతీయ రహదారి–30పై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులోనే ఒకరు సజీవ దహనమవ్వగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం వైపు వెళుతున్న లారీని భద్రాచలం వైపు నుంచి చింతూరు వైపు వస్తున్న టీఎస్08జీఈ 9755 నంబరు గల కారు వేగంగా ఢీకొట్టింది.
ఈ క్రమంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న వాహనదారులు వారిని గమనించి, డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని కిందకు దింపారు. ఆ పక్క సీట్లో కూర్చున్న మరో వ్యక్తిని కిందకు దింపే క్రమంలో డోరు లాక్ కావడం.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. దీంతో కళ్లెదుటే డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని అంబులెన్సులో సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కారులో ఇద్దరే ఉన్నారని, ఇద్దరూ మృతి చెందడంతో వారి వివరాలు తెలియ రాలేదని పోలీసులు తెలిపారు.


