సింహాచలం: వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో కొలువుదీరిన సింహవల్లీ తాయారు అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. సింహాసనంపై సింహవల్లీ తాయారు, చతుర్భుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంజేపచేశారు. పది ఆవృతులతో లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమపూజ జరిపారు. భక్తులకు కుంకుమ, శేషవవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. సాయంత్రం అమ్మవార్ల సన్నిధిలో సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు. అమ్మవార్లను పల్లకిలో వేంజేపచేసి ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. విశేష హారతులు అందించారు.


