మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం కేజీహెచ్ రోగులపై పడుతోంది. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్యుల కొరతతో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలో జాప్యం జరుగుతోంది. జూనియర్ వైద్యుల విధులను నర్సింగ్ సిబ్బంది, ఎంఎన్వోలు నిర్వహించాల్సి వస్తోంది. 11 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శుక్రవారం కేజీహెచ్ నుంచి ఏఎంసీ మీదుగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిరసన తెలిపారు. రిలే దీక్షలో డాక్టర్లు విజేత, రక్షక్, కల్యాణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.తమ నిరసన కార్యక్రమం రోగులకు వ్యతిరేకం కాదని, రోగుల సంరక్షణ తమ బాధ్యత అని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు దినకర్ సాయి శ్రీనివాస్ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడీఏ) నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యజీత్, మనోహర్, దినకర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


