రోలుగుంట: కుసుర్లపూడి గ్రామానికి చెందిన కై సర్లవాని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం చెరువులోకి ట్రాక్టర్లు, పొక్లెయిన్లు తరలించి కొందరు అక్రమార్కులు మట్టి తవ్వకాలు ప్రారంభించారు. గ్రామ చెరువును అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువతకు ఈ అక్రమ తవ్వకాల విషయం తెలియడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలు ఆపాలంటూ అక్రమార్కులను నిలదీశారు. ఈ విషయం ‘డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి, మీరు ఎవరు?’అంటూ అక్రమార్కులు వాదనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై తహసీల్దార్ నాగమ్మను ఫోన్లో సంప్రదించగా, తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తనకు సమాచారం లేదని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇరిగేషన్ ఏఈ డి.సూర్యనారాయణను సంప్రదించగా, సిబ్బందిని పంపించి తవ్వకాలను నిలిపివేశామని తెలిపారు. తాత్కాలికంగా పనులు ఆగిపోవడంతో గ్రామ యువత వెనుదిరిగినప్పటికీ, ఈ వ్యవహారం మరింత వివాదాలకు దారి తీస్తుందేమోనన్న ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది.


