సినిమాకు ముహూర్తపు షాట్
సీలేరు: ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన దారకొండలో కొలువైన శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధిలో నూతన తెలుగు చిత్రం ‘ధీరధాత్రి’ ముహూర్తపు తొలి షాట్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేద మంత్రోచ్ఛారణల నడుమ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందం అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కంభంపాటి మాట్లాడుతూ... దారాలమ్మ తల్లి సన్నిధిలో ‘ధీరధాత్రి’ చిత్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి గూడెంకొత్తవీధి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, శరవేగంగా కొనసాగిస్తామని తెలిపారు. కథాబలంతో పాటు నటీనటుల ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని వినూత్న శైలిలో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వంశీ కథానాయకుడిగా, మామిత కథానాయికగా నటిస్తున్నారు. మన్యం అందాలను, కథలోని కీలక సన్నివేశాలను అద్భుతమైన దృశ్యాలతో ఆవిష్కరించేందుకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కిరణ్ పనిచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం, మన్యం నేపథ్యం, నటీనటుల ప్రతిభ, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల సహకారంతో ‘ధీరధాత్రి’ చిత్రాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.


