డుంబ్రిగుడ: అరకు గ్రామంలో ఈనెల 12న జరిగిన చోరీ కేసును స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. స్థానిక అరకులోయ సీఐ కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షావుకారి బాలకృష్ణ అనారోగ్యంతో మృతి చెందడంతో, కుటుంబ యాజమాని లేకపోవడంతో బాధిత కుటుంబీకులు అత్తింటి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రాత్రి గుర్తుతెలియని దుండగులు కిటికీలు పగులగొట్టి గదిలోకి చొరబడి, బీరువాలోని వస్తువులను చిందరవందర చేసి పక్కనే ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. బాధితుడి తండ్రి షావుకారి దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ సురేష్ నేతృత్వంలో క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ను రప్పించి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముద్దాయిల ఆనవాళ్లను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలతో పాటు కాల్ డేటాను విశ్లేషించి ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల గాలింపు చర్యల్లో భాగంగా ఈనెల 18న బొందుగుడ జంక్షన్లో సాయంత్రం ఆరు గంటల సమయంలో అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వెళ్లగా.. పోలీసులను చూసి పారిపోతున్న అరకు గ్రామానికి చెందిన అడకట్ల శరత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా దొంగతనం చేసినట్లు రుజువైందని సీఐ తెలిపారు. అతని నుంచి 8.25 తులాల బంగారం, 919 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ చోరీ సొత్తు విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఉమాశంకర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుని లాకర్తో పాటు మిగతా నగదును కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గిరిజనులు, పర్యాటకులు ఎవరైనా సరే చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో డుంబ్రిగుడ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడి అరెస్టు
8.25 తులాల బంగారం,919 గ్రాముల వెండి స్వాధీనం
వివరాలు వెల్లడించినఅరకు సీఐ కోటేశ్వరరావు


