చింతపల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలని ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాంగి గణబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కావున గ్రామ కమిటీ సభ్యులు ప్రతి గడపకూ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వివరించి వారి మద్దతును కూడగట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయాలు సాధించుకున్నామో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కార్యకర్తలు మరింత కష్టపడి ప్రతి పంచాయతీని కై వసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, కేవలం గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ కోరభు అనూషదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూసారి కృష్ణరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, వైస్ ఎంపీపీలు గోపీనాయక శారద, సాగిన వెంగళరావు, సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్, మోరీ రవి, జిల్లా యువజన కార్యదర్శి వేములపూడి పరమేష్తో పాటు వివిధ పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీజిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు


