ముంచంగిపుట్టు: పీఎం జన్మన్ హౌసింగ్ బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.నర్సయ్య డిమాండ్ చేశారు. స్థానిక కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గృహాలు మంజూరు చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయి, మొండిగోడలతో దర్శనం ఇస్తున్నాయన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నందున రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రూ.లక్ష వెంటనే చెల్లించాలని కోరారు. జనరల్ కేటగిరీ కింద గృహాలు ఇస్తామని చెప్పి, సర్వే చేసి సంవత్సరం పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా మంజూరుచేయక పోవడం అన్యాయమన్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10 లక్షలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల నేతలు లైకోన్, నారాయణ, జీనబందు, శ్రీను, డోంబురు తదితరులు పాల్గొన్నారు.


