విస్తారంగా సాగవుతున్న వేరుశనగ పంట
మొక్కజొన్న పైరు
రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నఉద్యానవనశాఖ అధికారి శిరీష
డుంబ్రిగుడ: గిరిజన రైతులు సంప్రదాయ వ్యవసాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో అల్లం సాగు విస్తరిస్తోంది.
అరమ, తూటంగి, లైగండ, సొవ్వా, సాగర, కురిడి, పోతంగి, కండ్రుమ్ తదితర పంచాయతీల్లో సుమారు 600 ఎకరాల్లో రైతులు అల్లం సాగు చేస్తున్నారు. దీంతో పాటు 302 ఎకరాల్లో నాటు మొక్కజొన్న, 80 ఎకరాల్లో స్వీట్కార్న్, 950 ఎకరాల్లో వేరుశనగ పంట సాగవుతోంది.
ఉద్యానవనశాఖ అధికారులు పంచాయతీల్లో పర్యటిస్తూ పంటల సాగు, తెగుళ్ల నివారణ, దిగుబడి పెంపుపై రైతులకు సూచనలు చేస్తున్నారని రైతులు తెలిపారు. గతేడాది గసభ, సొవ్వా, అరమ, పోతంగి, కురిడి, కండ్రుమ్ పంచాయతీల్లో గుర్తించిన రైతులకు ప్రోత్సాహకంగా హెక్టారుకు రూ.12 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ప్రోత్సాహక నగదు అందలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అల్లం మొదటి రకం కిలో రూ.90 నుంచి రూ.120, రెండో రకం రూ.60 నుంచి రూ.90 వరకు ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొంత అల్లం కుళ్లిపోతుండటంతో ఆందోళన చెందుతున్నా.. అధికారులు సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ధరలు మరింత పెరిగితే మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి అల్లం తవ్వకాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మరోవైపు పర్యాటక సీజన్ నేపథ్యంలో స్వీట్కార్న్, నాటు మొక్కజొన్న కంకులకు కూడా డిమాండ్ పెరిగింది. వ్యాపారులు రైతుల తోటల వద్దే ఒక్క కంకిని సుమారు రూ.15కు కొనుగోలు చేసి పర్యాటకులకు రూ.30 వరకు విక్రయిస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పంట విక్రయించడంతో రైతులకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు.
లాభాలు వచ్చే అవకాశం
ఈ ఏడాది సుమారు ఎకరాలో 20 బస్తాల అల్లం వేశా. ఉద్యానవనశాఖ అధికారుల సూచనలతో వచ్చే నెలలో పంట తీస్తే మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. పాత అల్లం కావడంతో వర్షాలకు కుళ్లిపోతుందేమోనని మొదట భయపడ్డా. అయితే ప్రస్తుతం అల్లం దుంపలు బాగానే ఉన్నాయి. పాత అల్లాన్ని తీసి విక్రయించిన తర్వాత.. రెండోసారి వచ్చే అల్లంతో మరింత లాభం పొందుతామని ఆశిస్తున్నాం.
– పాంగి లోకినాథ్, రైతు, రంగినిగుడ,
పోతంగి పంచాయతీ, డుంబ్రిగుడ
బోదెల పద్ధతిలో నాటుకోవాలి
ఆరోగ్యంగా, తెగుళ్లు లేని మంచి నాణ్యత కలిగిన అల్లం దుంపలను విత్తనంగా ఎంపిక చేసుకోవాలి. ఒక్కో విత్తన ముక్క 20 నుంచి 25 గ్రాముల బరువు ఉండి, ఒకటి లేదా రెండు మొగ్గలు ఉండటం మంచిది. ఎకరానికి సాధారణంగా 600 నుంచి 800 కిలోల విత్తన దుంపలు అవసరమవుతాయి. నాటే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ట్రైకోడెర్మా విరిడీ 5 గ్రాములను లీటరు నీటిలో కలిపి, అల్లం దుంపలను శుద్ధి చేసిబోదెల పద్ధతిలో నాటుకోవాలి.
– కె. శిరీష, ఉద్యానవనశాఖ అధికారి, డుంబ్రిగుడ


