సీలేరు: కొడుకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీలేరుకు చెందిన ఇంటర్ విద్యార్థి దమ్ము జీవన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన దమ్ము సురేష్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు జీవన్ పదో తరగతి పూర్తిచేసిన అనంతరం ఇంటర్ చదువుల కోసం విశాఖపట్నంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. గురువారం పెందుర్తిలో బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జీవన్ను విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. దమ్ము సురేష్ సీలేరులో కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్న తపనతో కుమారుడు జీవన్ను విశాఖపట్నంలో ఇంటర్ చదివిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడు అకాల మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


