పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ, సంపంగిపుట్టు సమీపం నుంచి తమరడ గ్రామం వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా సోలార్ బ్లింకర్ల (ఫ్లాషింగ్ సిగ్నల్ లైట్లు)ను ఏర్పాటు చేశారు.గత ఏడాది కాలంగా ముంచంగిపుట్టు మండలం కుజభంగి జంక్షన్ నుంచి సంపంగిపుట్టు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టగా, ఇటీవల ఆ పనులు పూర్తయ్యాయి. అయితే, ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో, రాత్రి వేళల్లో వాహనదారులకు మార్గదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హెచ్చరిక బోర్డులతో పాటు సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సుమారు 200 బ్లింకర్లను మాత్రమే అమర్చినట్లు ఆర్అండ్బీ సిబ్బంది తెలిపారు. అయితే, ఈ మార్గంలోని ప్రమాదకరమైన మలుపుల వద్ద మరిన్ని బ్లింకర్లను ఏర్పాటు చేస్తే, ప్రమాదాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.


