పాడేరు: నీతి ఆయోగ్ ఆకాంక్ష ర్యాంకింగ్ల్లో దేశంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోవడం జిల్లా యంత్రాంగం సాధించిన విశిష్ట విజయమని కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సదుపాయాలను ప్రజలకు చేరువ చేయడంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన ప్రతి అధికారి, ఉద్యోగి, క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలకు ఆమె అభినందనలు తెలిపారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తత
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై కలెక్టరేట్లో ఆదివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అరకు, ముంచంగిపుట్టు, పాడేరు, చింతపల్లి మండలాల్లో పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను జూలై 13వ తేదీలోగా వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరణించిన వారి పేర్లు, వలస వెళ్లిన వారి వివరాలను తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్వోలు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రవీకరించాలని కోరారు.1,200 మందికి పైగా ఓటర్లు ఉండి, పోలింగ్ కేంద్రాలకు రెండు కిలోమీటర్లకు మించి దూరం ఉన్న 30 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలోని 624 మంది బీఎల్వోలు అంకితభావంతో పనిచేయడం వల్ల 4,99,752 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయింది. ఇప్పటివరకు 4,81,917 ఫారాలను (96.43 శాతం) డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. ప్రజల సహకారంతో పారదర్శకమైన, దోషరహిత ఓటరు జాబితాను రూపొందిస్తామని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు.


