తిలకించిన జేసీ, పీవో దంపతులు తిరుమణి శ్రీపూజ, ఆదిత్యవర్మ నాటు పడవపై విహారం
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ, సుజనపేట గ్రామ సమీపంలో ఉన్న మత్స్యగెడ్డ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఆదివారం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మత్స్యగెడ్డలో నాటుపడవపై ప్రయాణించి, గెడ్డ పరిసర ప్రాంతాలను, ప్రకృతి ఒడిలో ఉన్న చిన్న చిన్న దీవులను చూసి ముగ్ధులయ్యారు. వంపులు తిరుగుతూ సాగే మత్స్యగెడ్డ అందాలను చూసి వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాజీ సర్పంచ్ వెంగడ రమేష్తో మాట్లాడి, ఈ ప్రాంతంలోని పర్యాటక అవకాశాలు, స్థానిక మత్స్యకారుల జీవన విధానం గురించి ఆరా తీసి తెలుసుకున్నారు.


