యలమంచిలి రూరల్: మండలంలోని పురుషోత్తపురం కూడలి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన దంతులూరి రామరాజు(70) మృతి చెందాడు. గ్రామంలో హైవే అవతల ఉన్న మిల్లు దగ్గరకు చోళ్లు ఆడించడానికి వెళ్తూ ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనం వ్యాన్ కింద చిక్కుకుపోయింది.తలకు బలమైన గాయం కావడంతో రామరాజును హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన చెప్పారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం రామరాజు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.ఈ ప్రమాదంతో పురుషోత్తపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 10 రోజుల క్రితం పురుషోత్తపురం కూడలి వద్ద యువకుడు ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు మళ్లీ మరొకరు విగతజీవిగా మారారు. పురుషోత్తపురం కూడలి వద్ద ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పురుషోత్తపురం హైవే కూడలి వద్ద ప్రమాదం


