ఆరిలోవ(విశాఖ): జనావాసాల మధ్య గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఆరిలోవలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. టీఐసీ పాయింట్ నుంచి ఆరిలోవ చివరి బస్స్టాప్ వరకు ఎర్రజెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీ చేపట్టి, డేటా సెంటర్ వల్ల కలిగే పరిణామాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మాజీ కార్పొరేటర్ బి.గంగారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ.. సింహాచలం దేవస్థానం కొండపై 160 ఎకరాలు డేటా సెంటర్కు కేటాయించడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు. లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. డేటా సెంటర్ వల్ల కొండలు ధ్వంసమవడంతో పాటు గాలి, శబ్ద కాలుష్యం పెరిగి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ముడసర్లోవ రిజర్వాయర్ నీటిని భారీగా వినియోగించడం వల్ల తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు డి.అప్పలరాజు, వి.నరేంద్రకుమార్, పి.శంకరరావు, డి.నాగరాజు, కె.కుమారి తదితరులు పాల్గొన్నారు.


