అనకాపల్లి: పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు కలెక్టర్లు విజయకృష్ణన్, దినేష్ దంపతులు అన్నారు. స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఉగాది పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను కలెక్టర్ దంపతులు గురువారం అందజేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విజయకృష్ణన్ మాట్లాడుతూ గత ఏడాది నుంచి నూకాంబిక అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించడం ఆనందదాయకమని, అమ్మవారి సన్నిధిలోనే ఉగాది పండగ కుటుంబ సమేతంగా జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకొనే ఉగాది పండగ ప్రజలందరికీ సౌభాగ్యాలను కలిగించాలని, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుని, భావితరాల ప్రజలకు వారసత్వంగా అందించాలన్నారు. అమ్మవారి ఆలయ ఆవరణలో వేదపండితులు రేజేటి అప్పలాచార్యులు పంచాగ శ్రవణం గావిస్తూ పరాభవ సంవత్సర నవ నాయకుల సంచారాన్ని బట్టి సంవత్సర కాల ప్రభావాలను అనంతరం 12 రాశుల ఆదాయ, వ్యయాలను తెలిపారు. అనంతరం ఎస్.రాయవరం మండలం కోరుప్రోలు సీతారామ స్వామి దేవాలయం అర్చకులు సుదర్శనం నారాయణాచార్యులు, చీడికాడ మండలం ఖండివరం రామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు అయాలూరి భాస్కరరావు, అనకాపల్లి వేల్పులవీధి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు దొంతుకుర్తి సూర్య ప్రకాశరావు, అనకాపల్లి గవరపాలెం నూకాలమ్మ వారి దేవాలయం ప్రధాన అర్చకులు సింహంబట్ల కామేశ్వర శర్మ, నర్సీపట్నం దుర్గ మల్లేశ్వరస్వామి దేవాలయం అర్చకులు పెరి వెంకట నరసింహ మూర్తి, యలమంచిలి వేణుగోపాలస్వామి దేవాలయం అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అర్చకులు లంబసింగి క్రిష్ణపాండవుల దేవాలయం అర్చకులు తరముల కొండలరావు, చింతపల్లి మండలం సీతారామాలయం దేవాలయం అర్చకులు గడుతూరి రాజారావు, చింతపల్లి మండలం కొండావంచుల పాడి మోహన్రావులను కలెక్టర్ దంపతులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్ దంపతులు, దేవదాయశాఖ ఉప కమిషనర్ ఎన్.సుజాత, జిల్లా దేవదాయశాఖ అధికారి కవిటపు లక్ష్మీ సుధారాణి, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆర్డీవో షేక్ ఆయిషా, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


