అచ్యుతాపురం రూరల్: మండలంలోని ఖాజీపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మూడు దేవాలయాలతోపాటు ఒక వ్యక్తి ఆటో చోరీకి గురయ్యాయి. సర్పంచ్ పీలా నర్సింగరావు కథనం మేరకు.. గ్రామంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మోదమాంబ, దుర్గాలమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాల హుండీల్లో నగదు రూ.30 వేలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దాంతో పాటు అదే గ్రామానికి చెందిన బుదిరెడ్డి శ్రీను ఆటో కూడా ఎత్తుకుపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ అధికారులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. చోరీకి గురైన ఆటోను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అనకాపల్లి హైవే పక్కన సబ్బవరం వెళ్లే మార్గంలో శంకరం దగ్గర పురుషోత్తపురానికి చెందిన వ్యక్తి గుర్తించినట్లు సర్పంచ్ తెలిపారు.


