సాక్షి, పాడేరు: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు చాణక్య వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయాలకు అతీతంగా, తమ కుటుంబ సభ్యుడే వస్తున్నాడన్న ఉత్సాహం మన్యం వాసుల్లో స్పష్టంగా కనిపించింది. పదవిలో ఉన్నా లేకపోయినా.. గిరిజనుల గుండెల్లో జగనన్న స్థానం సుస్థిరం అని ఈ జనసందోహం నిరూపించింది.
మారుమోగిన ‘జై జగన్’ నినాదాలు
బుధవారం మధ్యాహ్నం జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ వజ్రాల కొండ హెలీప్యాడ్పై దిగగానే వాతావరణం ఒక్కసారిగా ఉద్వేగభరితంగా మారిపోయింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ చేసిన నినాదాలతో అరకు లోయ మారుమోగిపోయింది. తమ ప్రియతమ నేతను చూడటానికి గిరిపుత్రులు కొండలు, చెట్లపైకి ఎక్కి వేచి చూడటం ఆయనకున్న క్రేజ్కు నిదర్శనంగా నిలిచింది.
మినీ పాదయాత్రను తలపించిన స్వాగతం
హెలీప్యాడ్ నుంచి తంగులగూడ కల్యాణ వేదిక వరకు సాగిన జగన్ ప్రయాణం ఒక మినీ పాదయాత్రను తలపించింది. అడుగడుగునా ప్రజలు ఆయనపై ప్రేమను కురిపించారు. గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య జగన్కు ఘన స్వాగతం లభించింది.రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర నిలబడిన వేలాది మంది ప్రజలకు జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఆత్మీయ పలకరింపు
వృద్ధులు, మహిళలు జగన్ను చూసి ఉద్వేగానికి లోనవ్వగా, ఆయన వారి వైపు నవ్వుతూ పలకరించడం అక్కడి వారిని కట్టిపడేసింది.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
కల్యాణ వేదిక వద్ద ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుటుంబ సభ్యులు జగన్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులు రేగం చాణక్య, వారి జీవిత భాగస్వామిని జగన్ ఆత్మీయంగా ఆశీర్వదించారు. పదవిలో ఉన్నా లేకపోయినా గిరిజనుల గుండెల్లో జగనన్న స్థానం సుస్థిరమని ఈ పర్యటన మరోసారి నిరూపించింది. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడీక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతిదేవి,చింతలపూడి వెంకటరామయ్య,చెట్టి పాల్గుణ, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, యువజన విభాగం నేత చెట్టి వినయ్, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఎస్టీసెల్ ఉమ్మడి జిల్లా మాజీ నేత కమ్మిడి అశోక్,అన్ని మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు,రాష్ట్ర,జిల్లా,మండల పార్టీ నాయకులు హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అభిమాననేతను చూసేందుకు నిరీక్షిస్తున్న జనం
ప్రియతమ నేతను చరవాణిల్లో బంధిస్తున్న అభిమానులు


