అంతులేని వ్యఽథ
మన్యం ప్రాంత రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని భావించిన ‘516–ఈ’ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం గందరగోళంలో పడ్డాయి. గడువు ముగిసినా అడుగు ముందుకు పడని వైనం, కొండచరియల విరుపులతో ప్రమాదకరంగా మారిన ప్రయాణం, భూములు కోల్పోయి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న గిరిజన రైతుల ఆవేదన.. వెరసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గూడెంకొత్తవీధి మండలంలో ఒక ప్రహసనంలా మారింది. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక అడ్డంకుల నడుమ మన్యం మకుటం ముళ్ల బాటగా మారుతోంది.
అభివృద్ధి బాటలో..
ప్రహసనంలా ‘516–ఈ’ జాతీయ రహదారి పనులు
● గడువు ముగిసినా ముందుకు పడని అడుగు ● నష్టపరిహారం అందక గిరిజన రైతుల వేదన
● క్లిష్టంగా రంపుల ఘాట్రోడ్డులో విస్తరణ పనులు ● విరిగి పడుతున్న కొండచరియలు
● ప్రమాదకరంగా ప్రయాణం
గూడెంకొత్తవీధి: మన్య ప్రాంతానికే మకుటాయమానంగా నిలుస్తుందని భావించిన 516–ఈ జాతీయ రహదారి నిర్మాణం గూడెంకొత్తవీధి మండలంలో ప్రస్తుతం ఒక ప్రహసనంగా మారింది. గతేడాది డిసెంబరు నాటికే పూర్తి కావాల్సిన ఈ రహదారి, అనేక అడ్డంకులు.. అవరోధాల వల్ల అడుగు ముందుకు పడటం లేదు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే మన్యం రూపురేఖలు మారి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశించినా, అది నేటికీ ఒక కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రంపుల ఘాట్ రోడ్డులో సవాళ్లు
రంపుల ఘాట్ రోడ్డులో రహదారి విస్తరణ పనులు అత్యంత క్లిష్టంగా మారాయి. అత్యంత ఇరుకై న ఈ మార్గాన్ని విస్తరించేందుకు కొండలను తవ్వారు. అయితే, వర్షాల సమయంలో కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
నష్టపరిహారంపై గిరిజనుల ఆవేదన
రహదారి నిర్మాణం కోసం పలు గ్రామాలకు చెందిన గిరిజన రైతులు తమ పంట భూములు, కాఫీ తోటలు మరియు ఇంటి స్థలాలను కోల్పోయారు. నిబంధనల ప్రకారం అందరికీ తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, అది నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కేవలం కొద్దిమందికి మాత్రమే అరకొరగా పరిహారం అందిందని, తమకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. మరోవైపు, రహదారి పనుల వల్ల సాగునీటి కాలువలు పూడిపోవడంతో సాగు, తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది.
ప్రాజెక్టు వివరాలిలా..
రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకు సుమారు 209 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ. 4 వేల కోట్లు కేటాయించింది. మొత్తం ఆరు ప్యాకేజీలుగా ఈ పనులు చేపట్టారు.
● రాజమహేంద్రవరం – రంపచోడవరం:
44 కిలోమీటర్లు
● రంపచోడవరం – కాకరపాడు
(కొయ్యూరు మండలం): 74 కిలోమీటర్లు
● కాకరపాడు – పాడేరు (చాపరాతిపాలెం,
లంబసింగి మీదుగా): 133 కిలోమీటర్లు
● పాడేరు – బల్తుగుడ (అరకులోయ):
49 కిలోమీటర్లు
● బల్తుగుడ – బౌడార: 43 కిలోమీటర్లు
● బౌడార – విజయనగరం: 27 కిలోమీటర్లు
కొనసాగుతున్న అడ్డంకులు
రంపుల మార్గంలో పెదవలస, చాపరాతిపాలెం తదితర గ్రామాల రైతులు తమకు పరిహారం అందే వరకు పనులు సాగనివ్వబోమని గతంలో ఆందోళనలు చేపట్టారు. పాడేరు సబ్ కలెక్టరు వారితో చర్చలు జరిపి ఒప్పించడంతో పనులు ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. వీటికి తోడు, సీలేరు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ విద్యుత్ టవర్లు రహదారికి అడ్డంగా ఉన్నాయి. వీటిని తొలగించాలంటే విద్యుత్ శాఖ అనుమతులు అవసరం. ఇలాంటి అనేక సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకుల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. తమ భూములు కోల్పోయి, పరిహారం అందక, సాగునీరు లేక అల్లాడుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
అంతులేని వ్యఽథ


