అతివేగం.. అంతిమ ప్రయాణం
● మితిమీరిన వేగంతో
నడపడం వల్లే ప్రమాదాలు
● మద్యం మత్తు కూడా కారణం
● కన్నవారికి, కుటుంబాలకు గుండెకోత
కొయ్యూరు జాతీయ రహదారిపై మృత్యువు విలయతాండవం
కొయ్యూరు: జాతీయ రహదారి 516ఈ మృత్యుదారిగా మారుతోంది. రహదారి విస్తరణ జరిగిన తర్వాత వాహనదారులు, ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో బైక్లు నడుపుతూ మలుపుల వద్ద అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎదుటివారి ప్రాణాలను బలితీసుకుంటున్నారు. కన్నవారికి, కుటుంబ సభ్యులకు గుండెకోత మిగిలిస్తున్నారు.
● గతంలో విడుదలైన లాన్సెట్ నివేదిక ప్రకారం.. అత్యధిక రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణం. పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నా, వాహనదారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు.చాలా మంది యువకులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నియంత్రణ కోల్పోయి ఇతరులను ఢీకొంటున్నారు.
రోడ్లపై పశువుల సంచారం..
రాత్రి వేళల్లో నడింపాలెం నుంచి చింతాలమ్మ ఘాట్ వరకు రోడ్లపై గేదెలు, ఇతర పశువులు ఉండటం వల్ల వేగంగా వచ్చే వాహనదారులు వాటిని గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు.
● 2024 సెప్టెంబర్ 29: రావణాపల్లి సమీపంలో తప్పుడు మార్గంలో వచ్చిన కారు బైక్ను ఢీకొన్న ఘటనలో యాదిగిరి రాజుబాబు, అంబటి అప్పన్నస్వామి మృతి చెందారు.
● 2025 సెప్టెంబర్ 25: సింగవరానికి చెందిన పాంగి అఖిల్ పిట్టాచలం సమీపంలో డివైడర్ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు.
● 2026 జనవరి 17: రామరాజుపాలెం వంతెన వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో సాగిన రాంబాబు మృతి చెందాడు.
● 2026 ఫిబ్రవరి 26: స్కూటీపై వెళ్తున్న పాస్టర్ మోషే చింతలపూడి సమీపంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆచరణలో లేని ‘రోడ్డు భద్రత’ ప్రమాణాలు
ఇటీవల కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ భీమవరం చెక్పోస్టు వద్ద యువతతో ‘రోడ్డు భద్రతా ప్రమాణం’ చేయించారు. హెల్మెట్ ధరిస్తామని వారు హామీ ఇచ్చినా, ఆచరణలో మాత్రం మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చింతాలమ్మ ఘాట్ మలుపులో
వీఆర్వో బైక్ను ఢీ కొట్టిన కారు
అతివేగం.. అంతిమ ప్రయాణం
అతివేగం.. అంతిమ ప్రయాణం


