వాగులోకి దూసుకెళ్లిన బైక్
సీలేరు: చింతపల్లి మండలం ఆసరాడ గ్రామానికి చెందిన కొందరు యువకులు ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. తమ సోదరి పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన తీరు..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆసరాడ గ్రామానికి చెందిన నర్సింగ్ (36), కార్తీక్ (30), బాలరాజు (25) ఆదివారం జి. కొత్తూరు గ్రామంలోని తమ బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి బయలుదేరారు. వీరితో పాటు జి. కొత్తూరుకు చెందిన ప్రకాష్ అనే మరో యువకుడు కూడా అదే బైక్పై ఎక్కాడు. ఇలా నలుగురు ఒకే బైక్పై కొంగపాకల వైపు వెళ్తుండగా, రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది. రోడ్డుపై పైకి తేలి ఉన్న రాళ్లపైకి బైక్ చక్రం ఎక్కడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకుపోయింది.
ఆసుపత్రికి తరలింపు..
ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే దారకొండ ఆసుపత్రికి ఫోన్ చేయడంతో, 108 అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను దారకొండ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, నలుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అదుపుతప్పడంతో ప్రమాదం
నలుగురికి తీవ్రగాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
మెరుగైన వైద్యం కోసం చింతపల్లి
ఏరియా ఆస్పత్రికి తరలింపు
సంఘటన స్థలంలో ప్రమాదానికి గురైన బైక్, తీవ్రంగా గాయపడిన యువకులు


