మారుమూల గ్రామాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు
● సత్యసాయి భక్తులు, వైద్యులు రంగరావు, పద్మలతాదేవి దంపతులు
● చిన గంగవరంలో
మంచినీటి పథకం ప్రారంభం
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన గంగవరం గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. విజయవాడకు చెందిన సత్యసాయి భక్తులు, వైద్యులు రంగరావు, పద్మలతాదేవి దంపతులు కొత్తగా నిర్మించిన మంచినీటి కుళాయిలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల నుంచి మంచినీటి పథకాల కోసం విన్నపాలు వచ్చాయని, ఆయా గ్రామాలను పరిశీలించి త్వరలోనే మరిన్ని కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు.భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. భక్తులకు, గ్రామస్తులకు రగ్గులు, విభూది ప్రసాదం మరియు బాబా చిత్రపటాలను పంపిణీ చేశారు. మారుమూల గ్రామాల్లో పరిశుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ మండల కార్యదర్శి కవర్ల భగవాన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ కేవీఎన్ మూర్తి, సమితి కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మారుమూల గ్రామాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు


