విశాఖ డెయిరీ అవినీతిపైనివేదికను బహిర్గతం చేయాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న డిమాండ్
దేవరాపల్లి: విశాఖ డెయిరీ అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 2024 నవంబర్లో జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో వేసిన సభా కమిటీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సభా కమిటీ వేసి ఏడాదిన్నర దాటిన డెయిరీ యాజమాన్యం ఒత్తిళ్లకు తలొగ్గి దర్యాప్తు నివేదిక బయటపెట్టలేదని విమర్శించారు. సభా కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు ఎవరి మెప్పు కోసం కమిటీ వేశారని ప్రశ్నించారు. విశాఖ డెయిరీ యాజమాన్యం పాడి రైతులతో పాటు ఉద్యోగులను, కార్మికులను కష్టార్జితాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న వేసిన సభా కమిటీ దర్యాప్తునకు అతీగతీ లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సభా కమిటీ నివేదికను బహిర్గతం చేసి, డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


