వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తులు విమర్శలు
బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వెంకటేశ్వరస్వామి కల్యాణ మహాత్సవాలపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. 150 ఏళ్లపైగా చరిత్ర గల వడ్డాది వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై పలు గ్రామాల భక్తులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా ఐదు రోజుల పాటు కమనీయంగా నిర్వహించే స్వామి కల్యాణ వేడుకలను కనులార చూద్దామని రాష్టం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈసారి జరుగుతున్న 153 కల్యాణ మహోత్సవాల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంపై అధికారులు,పాలకుల తీరుపై మండిపడుతున్నారు. కల్యాణ వేడుకలు నిర్వహణపై పాలకులు, అధికారులు పెద్దగా ప్రచారాలు చేయలేదు. దీంతో ఈసారి ఉత్సవాలకు భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. దేవున్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులకు దేవస్ధానం తరపున ఎటువంటి ప్రసాదాలు అందించడం లేదు. కల్యాణ మహోత్సవాల రోజుల్లో కూడా శ్రీదేవి,భూదేవి,వేంకటేశ్వరస్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరణ చేయకపోగా, సాధారణ అలంకరణతోనే భక్తులకు చూపించడంపై పలువురు మండిపడుతున్నారు. వేడుక రోజుల్లో కూడా లాకర్లో స్వామి వారి ఆభరణాలు ఉన్న తీసుకొచ్చి అలంకరణ చేయకపోవడంపై భక్తులు మండి పడుతున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం దిగువన సుమారు కోటి రూపాయలతో కల్యాణ మండపం కడతామని చెప్పినా నిర్మాణానికి పునాది లేదు. చిన్నచిన్న గ్రామాల్లో కల్యాణ మండపాలు కట్టినా మేజర్ పంచాయతీ వడ్డాదిలో కల్యాణ మండపం కట్టకపోవడంపై ఎమ్మెల్యే, ఎంపీ,గ్రామంలో ఉన్న కూటమి నేతల తీరుపై భక్తులు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఆలయం పక్కనే కాపు సంఘం మండపాన్ని సగం నిర్మించి అసంపూర్తిగా వదిలేయడంపైనా మండి పడుతున్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిగే ఐదు రోజులు వడ్డాది రోడ్లు జనంతో రద్దీతో తీవ్ర ట్రాఫిక్తో ఉండేవి. కానీ నేడు ఉత్సవాల్లో సందడే కరువైంది. గతంలో కల్యాణం జరిగే ఐదు రోజులు భక్తులకు వినోదం కలిగేలా ఆలయం దిగువన, వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వేరువేరుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కానీ నేడు తెరపై సినిమాలు వేసే స్థాయికి దిగిపోయారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఉత్సవాలు ఏర్పాటుకు ఆలయ పాలక మండలి సభ్యులను నియమిస్తామని మూడేళ్లుగా చెబుతున్నా నేటికీ ఎమ్మెల్యే రాజు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ కీర్తి చరిత్ర పెరిగేలా అధికారులు, పాలకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల భక్తులు కోరుతున్నారు.
వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తులు విమర్శలు
వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తులు విమర్శలు


