జీడి రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి
దేవరాపల్లి: జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీ శివారు సమ్మెదలో జీడి రైతులతో కలిసి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీలో చర్చించి, కేజీ జీడి పిక్కలకు రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని కోరారు. జీడి పంటలను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినదించారు. జీడి పిక్కలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోడంతో దళారీ వ్యాపారుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. జీడి పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించి, నిలకడగా మద్దతు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. జీడి పంటను ఈ క్రాప్లో నమోదు చేసి, జీడి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటే జీడి రైతులతో కలిసి సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దొర స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొరతం పైడితల్లి, గతుం రాము, దొమ్మంగి చంద్రమౌళి, దొమ్మంగి చిన మూలనాయుడు, చికుముకల పూలయ్యనాయుడు పాల్గొన్నారు.


