సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయుల ధర్నా
సాక్షి, పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని, అలాగే ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రావుల జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయ సంఘ నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించి, కేవలం విద్యాబోధనకే పరిమితం చేయాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక తరగతులను విలీనం చేయకుండా, 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే కొనసాగించాలని, ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు మీడియం రెండింటినీ అందుబాటులో ఉంచాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. జీవో నంబరు3ను తక్షణమే పునరుద్ధరించి, 100 శాతం ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలని కోరారు. ధర్నా అనంతరం ఉపాధ్యాయ నేతలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నేతలు శ్యాంసుందరం, శెట్టి శాంతకుమారి, మోదకొండ, సింహాచలం నాయుడు, ధనుంజయ్, సోమినాయుడు, సత్యారావు, బాబూరావు, తిరుపతిరావు, కై లాసం తదితరులు పాల్గొన్నారు.
12వ పీఆర్సీ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్
పాడేరు ఐటీడీఏ ఎదుట ఆందోళన
టీచర్లను బోధనకే పరిమితం చేయాలి
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
రావుల జగన్మోహన్రావు డిమాండ్


