ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయి
నర్సీపట్నం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ఏపీ మోడల్ స్కూల్స్ విద్యా సంస్థ వారు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఆరు నుంచి 12వ తరగతి వరకు మంచి విద్యను అభ్యసించవచ్చు. క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటూ చదువుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఆదర్శ పాఠశాలలకు ఏటా పోటీ పెరుగుతోంది. జిల్లాలో నర్సీపట్నం, కశింకోట, రావికమతం, మునగపాక, చీడికాడ మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్కోచోట వంద సీట్ల భర్తీకి గాను ఏటా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సీటు పొందేందుకు ఏటా వందల మంది విద్యార్థులు పోటీ పడతారు. అందులో అత్యధిక మార్కులు సాధించే వారికే సీటు లభ్యం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దృష్టి పెడితే సీటు సాధించడం సులభమవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అధునాతన సౌకర్యాలు..
పట్టణానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, విశాలమైన గదులు, కంప్యూటర్ ల్యాబ్తో పాటు భౌతిక, జీవశాస్త్రం ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఆవరణలో విశాలమైన క్రీడా మైదానం ఉంది. ఏటా విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. యోగాలో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో సీటు సాధిస్తే ఉచిత విద్యతోపాటు వసతి, దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు అన్ని ప్రభుత్వం నుంచే అందిస్తారు.
మార్చి 31 వరకు గడువు..
ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www.cre.ap.gov.in, www.apmr.apcfrr.i n అనే వెబ్సైట్ల ద్వారా సమర్పించాలి. ఏప్రిల్ 12 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయి


