
మోదకొండమ్మ తల్లి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పాడేరు : గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను మే 11,12,13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ మత్య్సరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో ఉత్సవాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గతంలో కన్నా ఎంతో భిన్నంగా అన్ని వర్గాల ప్రజలు, భక్తులను కలుపుకొని ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు, చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కూడా సురేష్కుమార్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణ, కేజీయారాణి, రత్నబాయ్, ప్రశాంత్, మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
14 ఏళ్లుగా పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్
నాతవరం: కోర్టు వాయిదాలకు రాకుండా 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న గంజాయి నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశామని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. గురువారం నాతవరం ఎస్ఐ సిహెచ్.భీమరాజుతో కలిసి ఆమె మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా మీనంబలంపురం గ్రామానికి చెందిన పంగలి దేవన్ గంజాయి రవాణా చేస్తుండగా నాతవరం పోలీసులకు 2011లో పట్టుబడ్డాడన్నారు. ఆయన నుంచి 450 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని అప్పట్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన అప్పటి నుంచి వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. నిందితుడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక దృిష్టి సారించారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్టాల సరిహద్దులో సంచరిస్తున్న నిందితుడిని కేడీ పేట ఏఎస్ఐ వై.వెంకటరావు, నాతవరం పోలీసు కానిస్టేబుల్ కె.లోవరాజు ఈ నెల 23న చాకచాక్యంగా పట్టుకున్నారన్నారు. గురువారం అరెస్ట్ చేసి కోర్డుకు తరలించామన్నారు. ఎళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్న దేవన్ను పట్టుకున్న వెంకటరావు, లోవరాజులను ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారని సీఐ తెలిపారు.