చెరకు బకాయిలు చెల్లించాలి
చోడవరం: ప్రభుత్వ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కళ్లు మూసుకొని ఉందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ నోటికి గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ మెయిన్గేటు వద్ద ఏర్పాటుచే సిన నిరసన రిలేదీక్ష శిభిరం ఆదివారంకు 10వరోజుకి చేరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం, సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీసంఘం, ఏపీ రైతు సంఘం ఈ శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారు. రైతులు, రైతు కూలీలు, కార్మికులను కూటమి ప్రజాప్రతినిధులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఆందోళనలు, పది రోజులుగా రిలే నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు బకాయిలు రైతులకు వెంటనే చెల్లించాలని, ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను,పీలా మహేష్, పొట్నూరు అప్పలరాజు, బీవీ నూకరాజు, శరకాన అప్పలనాయుడు, మురళికృష్ణరాజు, పాచిలి రాంబాబు, సుగర్ ప్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రాయి సూరిబాబు, రామునాయుడు, జిల్లా రైతుకూలీ సంఘం అధ్యక్షుడు మోహనరావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు, వనం సూర్యనారాయణ, పోతల శ్రీరాముల పాల్గొన్నారు.


