ఆదిలాబాద్టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ప్రభుత్వ విద్య, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజుల నియంత్రణ, గ్రామీణ సంక్షేమం, ఆర్టీసీ తదితర అంశాలపై తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని మాధవరావు విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆయా రంగాల్లో సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. హక్కులు, సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవస్థల మనుగడకు క్షేత్రస్థాయిలో తగిన బడ్జెట్ కేటాయింపులు, భద్రత అత్యంత కీలకమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం కష్టతరంగా మారుతోందని పేర్కొన్నారు. కేవలం భవనాలు, గదులు ఉంటే సరిపోదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని అన్నారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయి రక్షణ, భద్రత కల్పించాలని కోరారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.


